'సైనైడ్'లో ప్రముఖ మలయాళ నటులు సిద్దిఖ్: కన్నడ నటులు రంగాయన రఘు

బుధవారం, 11 నవంబరు 2020 (17:14 IST)
పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో... జాతీయ పురస్కార గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైనైడ్'. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై.లి, ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ, "సైనైడ్ సినిమాకు ప్రారంభం నుంచే మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది. మలయాళంలో 300కు పైగా చిత్రాల్లో నటించి, రాష్ట్ర పురస్కారాలతో పాటు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న సిద్ధిఖ్ మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
 
తెలుగులో 'నా బంగారు తల్లి' చిత్రం ద్వారా ఆయన నంది అవార్డు అందుకున్నారు. అలాగే, కన్నడలో దాదాపు 250 చిత్రాలలో నటించి రెండు సార్లు కర్ణాటక  రాష్ట్ర అవార్డులను, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్న రంగాయన రఘు... కేరళ రాష్ట్ర పురస్కార గ్రహీత, పలు మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన మణికంఠన్ ఆచారి, మలయాళంలో దాదాపు 150 సినిమాలలో నటించిన శ్రీజిత్ రవి, ప్రశాంత్  అలెగ్జాండర్  ఈ సినిమాలో నటించనున్నారు. అంతే కాకుండా... 'మహర్షి, ఊపిరి, పంజా, గజని, ఫా, స్పెషల్ ఛబ్బీస్'తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే సినిమాలకు, 'ఉరిమి, మామాంగం, పడిసి రాజా' లాంటి హిస్టారికల్ చిత్రాలను కలుపుకొని దాదాపు వెయ్యి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించి కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత సునీల్ బాబు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో దాదాపు ఐదు సెట్లు నిర్మించాల్సి ఉంది. మా సినిమాలో సెట్స్ కున్న ప్రాముఖ్యతను ద్రుష్టిలో పెట్టుకొని సునీల్ బాబును ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంపిక చేశాం" అన్నారు.
 
ఈ సందర్భంగా ప్రైమ్ షొ ఎంటర్టైన్మెంట్ అధినేత కే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రవాసాంధ్రులైన మేము సినిమాల మీదున్న ఆసక్తితో తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ... దేశ వ్యాప్తంగా చక్కటి సినిమాలను నిర్మించాలనే ఉద్ధేశ్యంతో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ సంస్థను స్థాపించాం. ప్రియమణితో రాజేష్ టచ్ రివర్ రూపొందిస్తున్న 'సైనైడ్' చిత్రం కథ మమ్మల్ని బాగా ఇన్ఫైర్ చేసింది. మేము ఎటువంటి సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నామో... అటువంటి లైనులో ఈ సినిమా కథ ఉండటంతో మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై.లితో కలిసి నిర్మించడానికి ముందుకొచ్చాం. సైనైడ్ మోహన్ కేసును అందరూ పేపర్ లో చదివే ఉంటారు. కానీ, రాజేష్ టచ్ రివర్ తీసుకున్న పాయింట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. ఒక కథను ఇలా సరికొత్త స్క్రీన్ ప్లేలో చెప్పడం, తెలుగులో ఇదే తొలిసారి కావొచ్చేమో" అని అన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ, "సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసును ప్రేరణగా తీసుకొని 'సైనైడ్' చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథాంశానికి వస్తే... 20మంది అమ్మాయిలలో ప్రేమను ప్రేరేపించి, శారీరకంగా అనుభవించాక వారికి 'సైనైడ్' ఇచ్చి వాళ్ల బంగారు ఆభరణాలతో ఉడాయించే సైనైడ్ మోహన్ కేసు ప్రేరణతో ఈ కథ రూపొందించాం" అని అన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... హిందీలో ఇదే పోలీసాఫీసర్ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు.  
 
జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. బెంగళూరు, మంగళూరు, మైసూర్, కూర్గ్, మడిక్కెరి, గోవా, హైదరాబాద్, కాసరగోడ్ కీలకమైన షూటింగ్ ప్రదేశాలలో షూటింగ్ కొనసాగుతుంది. ఇంకా ఈ చిత్రం లో చిత్రంజన్ గిరి, తణికెళ్లభరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు, ముకుందన్, రిజు బజాజ్,  తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ నేపథ్య సంగీతం, డాక్టర్ గోపాల శంకర్ స్వరాలు అందించనున్నారు. ఎంజీఆర్ శివాజీ అకాడమీ అవార్డు గ్రహీత  శశి కుమార్ ఎడిటింగ్. జాతీయ అవార్డు గ్రహీత అజిత్ అబ్రహం సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.
 
పలు జాతీయ, అంతర్జాతీయ  అవార్డులు అందుకొని, ఇటీవల ‘వి’ సినిమాకు మేకప్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రశంసలుపొందిన స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ మెన్ గా ఎన్.జి. రోషన్,  రాజేష్ టచ్ రివర్ పలు చిత్రాలకు మాటలు రాసిన రవి పున్నం మాటలు,  డాక్టర్ గోపాల్ శంకర్ పాటలు అందిస్తున్నారు. పి.ఆర్.ఓలు గా  నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కంటెంట్ సలహాదారు: పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ , నిర్మాతలు : ప్రదీప్ నారాయణన్, కే నిరంజన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు