నితిన్ కపూర్ మృతిలో అనుమానాస్పదం... సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించండి : మోహన్‌బాబు

గురువారం, 16 మార్చి 2017 (10:25 IST)
నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి అనుమానాస్పదమని, మీడియా కూడా అలాగే రాయాలని సినీ నటుడు మోహన్ బాబు కోరారు. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించాలని ఆయన ప్రాధేయపడ్డారు. 
 
నితిన్ కపూర్ మంగళవారం రాత్రి ముంబైలో ఆరు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో మోహన్‌బాబు మరో సంచలన ప్రకటన చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, అనుమానాస్పద స్థితిలోనే మరణించారని ప్రకటించారు. వాస్తవాలేంటో తెలుసుకుని కథనాలు రాయాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఆర్థిక ఇబ్బందులతోనే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారంటూ ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. నితిన్ మృతిపై వస్తున్న కథనాలు జయసుధ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. నితిన్ మృతికి స్పష్టమైన కారణాలు తెలిసేదాకా అనుమానాస్పద మృతిగానే కథనాలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. 
 
‘‘జయసుధ నా సోదరి. నితిన్ మరణంపై ఎవరికిష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదు. నితిన్ మరణానికి కారణం ఇంకా తెలియదు. ఆర్థిక కారణాలే ఆయనను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పాయనడం అబద్ధం. ఆ కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడింది. ఇకనైనా ఆ కథనాలు ఆపితే బాగుంటుంది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగానే పరిగణించాలి’’ అని మోహన్ బాబు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి