స్వతహాగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన నాగబాబు ఈ అంశంపై మాట్లాడుతూ ఏ నాయకుడు తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని కోరారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కొట్టిపడేశారు. అవన్నీ అర్థంపర్థం లేని మాటలన్నారు. తాటాకు చప్పుళ్లకు మోడీ భయపడరని, చావో రేవో తేల్చుకుంటారని అన్నారు.
70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ మంచి నిర్ణయాన్ని తీసుకునే దమ్ము ఏ నాయకుడికీ లేకుండా పోయిందంటూ ఘాటైన విమర్శలు చేశారు. మెజారిటీ ఉన్నా మంచి నిర్ణయాన్ని తీసుకోలేని ప్రధానులు దేశంలో ఉన్నారన్నారు. తామరపువ్వు బురద లోంచే పుడుతుందని, ఇలాటి కుళ్లిన సమాజంలోంచి గొప్ప వ్యక్తి పుడతాడని మోడీని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పాలించేందుకు ఓ నియంత రావాలని, ఓ డిక్టేటర్ కావాలని అభిప్రాయపడ్డారు.
తాను కాంగ్రెస్ సభ్యుడిని కాబట్టి అర్జెంటుగా మోడీని విమర్శించేయాలన్న అభిప్రాయం తనకు లేదని కుండబద్దలుగొట్టారు. నిజానికి బీజేపీ విధానాలపై తనకు కొంత వ్యతిరేకత కూడా ఉందన్నారు. చిరంజీవి కాంగ్రెస్లో చేరడంతో తామంతా కాంగ్రెస్ సభ్యులమయ్యామన్నారు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ వరకు అందరి గురించీ మాట్లాడారు.