చైతు - అఖిల్ వివాహ వార్తలకు త్వరలో తెరదించుతా : నాగార్జున

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (05:14 IST)
తన ఇద్దరు కుమారులు, యువ హీరోలైన నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిల వివాహాలపై రోజుకో రీతిలో వస్తున్న వివాహాలపై త్వరలోనే తెరదించుతానని హీరో నాగార్జున స్పష్టం చేశారు. 
 
గత కొంతకాలంగా అక్కినేని యువవారసుల వివాహాల గురించి టాలీవుడ్‌లో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. నాగచైతన్య పెళ్లి సమంతతో, చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి అతని స్నేహితురాలి ... ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్తో జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. 
 
అయితే ఈ పుకార్లకు నాగార్జున తెరదించారు. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నిర్మల కాన్వెంట్' చిత్ర విశేషాలపై మాట్లాడుతూ నాగ్ ఈ విషయం చెప్పారు. నాగచైతన్య, అఖిల్ వివాహాలపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. మంచి ముహూర్తం చేసుకుని వివరాలు తెలియజేస్తామని నాగార్జున తెలిపారు. నాగ చైతన్య, అఖిల్  ఇద్దరూ వారి  జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం తనకు, సతీమణి అమలకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

అక్టోబర్‌లో నాగచైతన్య - కల్యాణ్‌కృష్ణ, అఖిల్‌-విక్రమ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తనకు ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రమంటే చాలా ఇష్టమని, అలాంటి స్క్రిప్ట్‌నే కల్యాణ్‌కృష్ణ తయారు చేశారని, చైతన్య ఆ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్యాణ్‌కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇకపోతే, అక్టోబర్‌ చివరినాటికి ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని.. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక ‘సోగ్గాడే-2 బంగార్రాజు’ చిత్రం వచ్చే యేడాది ప్రారంభమవుతుందని నాగార్జున స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి