పప్పుసేనకు నాపై అభిమానం ఎక్కువైంది.. వదిలిపెట్టలేకపోతున్నారు : కంగనా రనౌత్

ఆదివారం, 18 అక్టోబరు 2020 (13:43 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు మాటల తూటాలు పేల్చింది. మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. తనపై దేశ ద్రోహం కేసు (ఎఫ్ఐఆర్) నమోదవడం పట్ల ఆమె స్పందించారు. పప్పు సేనకు తనపై అభిమానం ఎక్కువై పోయిందనీ... అందుకే తనను వదిలిపెట్టలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, కంగనా రనౌత్‌పై బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ అలీ సయ్యద్ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు దేశ ద్రోహం కేసును నమోదు చేశారు. కంగనా సోదరి రంగోలిపై కూడా కేసు నమోదు చేశారు.
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చింది. దీంతో మహారాష్ట్ర అధికార పార్టీకి చెందిన శివసేనకు ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ కాస్టింగ్‌ డైరెక్టర్, ఫిట్‌నెట్‌ ట్రైనర్‌ మునావర్‌ అలీ సయ్యద్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్‌ అలీ సయ్యద్‌ బాంద్రా కోర్టును ఆశ్రయించారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్‌ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్‌ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు. 
 
ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా, ఈ షూటింగులో ఆమె పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో తనపై కేసు నమోదు కావడంపట్ల ఆమె స్పందిస్తూ, నవరాత్రుల సందర్భంగా ఎవరెవరు ఉపవాసం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దుర్గా పూజ తర్వాత తాను ఉపవాసం చేస్తున్నానని చెప్పారు. తనపై మరో ఎఫ్ఐఆర్ నమోదైందని, పప్పూసేనకు తనపై అభిమానం ఎక్కువైనట్టుందని, అందుకే తనను వదల్లేకపోతున్నారని ఎద్దేవా చేసింది. తనను మిస్ కావాల్సిన అవసరం లేదని... త్వరలోనే ముంబైకి వచ్చేస్తానని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు