మహేష్ బాబును కలిసిన డెహ్రాడూన్ సీఎం.. ఎందుకు?

సోమవారం, 18 జూన్ 2018 (16:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ మీసకట్టు, గెడ్డంతో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా మహేష్ బాబును ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. కాసేపు ప్రిన్స్‌తో రావత్ ముచ్చటించారు. అయితే, మర్యాదపూర్వకంగానే మహేష్‌తో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ''భరత్ అనే నేను'' సినిమా గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. 
 
కాగా బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి భారీ డిజాస్టర్లతో సతమతమైన ప్రిన్స్ భరత్ అనే నేను సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ కావడంతో ఫుల్‌జోష్‌లో వున్న మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్‌లో 25వ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. డెహ్రాడూన్‌లోని కళాశాల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరణ ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో మహేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ వచ్చాడని తెలుసుకున్న త్రివేంద్ర సింగ్ సెట్స్‌కు వెళ్లి మహేష్‌ని, చిత్ర యూనిట్‌ని కలిశారు. మహేష్‌తో త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు