పవన్ నోటి మళ్లీ పాట.. ఈసారి ఏ నరసింహుడో మరి..

బుధవారం, 12 జులై 2017 (07:45 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ పాటెత్తుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా పాటను పవన్ కల్యాణ్ పాడితే ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిన విషయమే. అభిమానులను అలరించిన ఆ పాట కదిరిలోని నరసింహస్వామి ఆలయాన్ని ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చింది. నటుడిగానూ, గాయకుడిగాను కూడా తనను తాను నిరూపించుకున్న పవర్ స్టార్ మరోసారి పాటెత్తుకుంటున్నారని సమాచారం.
 
గతంలో పలు చిత్రాల్లో పవన్‌కల్యాణ్‌ పాటలు పాడినా, నాలుగేళ్ల క్రితం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పాడిన ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా’ సాంగ్‌ పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి పవన్‌కల్యాణ్‌ తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. పవన్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో పవనకల్యాణ్‌ ఓ పాట పాడనున్నారని సమాచారం. 
 
‘కాటమరాయుడా..’ స్థాయిలో ఈ పాట కూడా అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పవన్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంలో భారీ అంచనాలు ఉన్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
అతి త్వరలోనే పవన్ కల్యాణ్ పాడే తాజా పాట ప్రేక్షకుల ముందుగు టీజర్‌గా కూడా రావచ్చునని ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి