చైతన్య అక్కినేని 'ప్రేమమ్' రిలీజ్ వాయిదా.. ఏఎన్నార్ జయంతి రోజున ఆడియో
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:14 IST)
చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ల కాంబినేషన్లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.
ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ 'ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం.స్టేషన్లో విడుదల చేసినట్టు గుర్తు చేశారు. 'ఎవరే..' అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించిందన్నారు.
యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' పుట్టిన రోజు కానుకగా పాట వీడియో..
యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా 'ఎవరే' పాట వీడియోను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో..
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో, చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.
'దసరా' కానుకగా 'ప్రేమమ్'..
ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబరులో 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. 'నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది 'ప్రేమమ్' అన్నారు.