గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని చెబితే అమ్మ నమ్మలేదు : హీరో రామ్ చరణ్

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (09:21 IST)
తనకు చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని మా అమ్మ సురేఖకు చెబితే ఆమె నమ్మలేదని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆయనకు చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ శనివారం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్ బహూకరించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఈ వర్సిటీలో 45 వేల మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. 
 
అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మ నమ్మలేదు. ఆర్మీ గ్రాడ్యుయేట్ల మధ్యలో నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు... నా అభిమానులది, దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది. వేల్స్ యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజమాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
 
'చెన్నై నాకెంతో ఇచ్చింది. మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా అర్ధాంగి ఉపాసన వాళ్ల తాతగారు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో 80 శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలుకని చెన్నెకి వస్తే అది నేరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారి కలలను నేరవేర్చేదిగా చెన్నై నగరం తన విశిష్టతను నిలుపుకుంటూ వస్తోంది. నేను ఇక్కడ విజయ హాస్పిటల్లోనే పుట్టాను... చెన్నైలోనే పెరిగాను' అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు