ఉగ్రవాదులు ప్రపంచాన్ని బాంబులు ఆత్మాహుతి దాడులతో ఒక పక్క వణికిస్తుంటే... మరో వైపు మాటల మాంత్రికుడు రాం గోపాల్ వర్మ మాత్రం ఈ విషయంలో తనదైన శైలిలోనే మాటల తూటాలను పేలుస్తున్నాడు. ఇటీవల ఇస్తాంబుల్, ఢాకా, న్యూయార్క్ వంటి చోట్లల్లో ఉగ్రవాదులు బాంబులు పేల్చి భీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తారో తెలీని భయంకరమైన పరిస్థితి ప్రజలలో నెలకొంది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగకు అనేక చోట్ల అలజడి సృష్టించాలని ముష్కరులు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ దాడిపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ... ప్రతీ స్కూల్లో విద్యార్థులకు ఖురాన్ నేర్పిస్తే.. కొన్ని విపత్కర పరిస్థితిలో వారికి ఉపయోగపడుతుంది. ఉగ్రదాడులు జరిగినప్పుడు ఏ మతం వారైనా తమను తాము కాపాడుకోలేరు. ఆ సమయంలో ''ఖురాన్ మాత్రమే వారిని గట్టెక్కిస్తుంది''అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. వర్మ ఇంతవరకు చేసిన కామెంట్లలో ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు.