బాలీవుడ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన "ఛలో" బ్యూటీ

ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (15:36 IST)
"ఛలో" మూవీ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రష్మిక. ఈమెకు ఓ బాలీవుడ్ ఆఫర్‌ వరించగా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నిజానికి 'గీత గోవిందం' చిత్ర తర్వాత ఈ భామకు పట్టిందల్లా బంగారమే అవుతోంది. 
 
నిజానికి ఈమె తన మొదటి చిత్రంతోనే టాలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. 'గీతా గోవిందం' సినిమాతో పలకరించి స్టార్ హీరోయిన్ స్థాయిలో స్టేటస్ సంపాదించేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోవడమే గాక వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ బడా దర్శకుల చూపు కూడా రష్మికపై పడింది.
 
ఈ క్రమంలో ఆమెపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కన్నుపడింది. తన కొత్త సినిమాలో రష్మికను ఓ పాత్ర కోసం సంప్రదించారట. అయితే ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉందనే కారణం చూపుతూ రష్మిక ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. 
 
ఇదిలావుంటే, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన తాజా సినిమా 'డియర్ కామ్రేడ్' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటించాడు. మరోవైపు మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా రష్మికనే కన్ఫమ్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు