శ్రీ వెంకట్, భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా వుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో దర్శకుడు బాలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ.. ''2012 లో సతీ తిమ్మమాంబ నవల రాశాను. ఒక జానపద చిత్రంగా తెరకెక్కించాలని భావించాను. జానపద చిత్రమయినా.. నవరసాలను మేళవించి తీశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది. అనంతపురం జిల్లాలోని మహావృక్షమైన మర్రిమాను చరిత్రకు సంబంధించిన చిత్రమిది. సినిమా బాగా వచ్చింది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. నిర్మాత గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది'' అని చెప్పారు.
హీరో శ్రీవెంకట్ మాట్లాడుతూ.. ''ఇదొక మంచి హిస్టారికల్ సినిమా. 400 సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, పాటలు: బందరు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: పెద్దరాసు సుబ్రహ్మణ్యం, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.