శ్రీదేవి మరణం : అమ్మను కోల్పోయానంటూ విలపిస్తున్న పాకిస్థాన్ నటి

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (10:30 IST)
కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్యదేవతగా ఉన్న శ్రీదేవి శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఆమె మృతి వార్తతో యావత్ భారతదేశం ఒకింత షాక్‌కు గురైంది. అలాగే, ఇతర దేశాల్లోని ఆమె అభిమానులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన నటి సజల్ అలీ బోరున విలపిస్తున్నారు. 
 
శ్రీదేవి చివరి చిత్రం "మామ్". ఇందులో శ్రీదేవి కుమార్తెగా సజల్ అలీ నటించింది. ఆ సమయంలో సీనియర్ నటితో ఆమెకు ఎనలేని అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై సజల్ అలీ స్పందించారు. మరోమారు అమ్మను కోల్పోయానంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు గతంలో తాను శ్రీదేవితో కలసి దిగిన ఫోటోను సజల్ తన ఇన్‌స్టా‌గ్రాంలో పోస్టు చేసింది. 
 
కాగా, సజల్‌ తల్లి 'మామ్‌' సినిమా షూటింగ్‌ సమయంలో మృతి చెందడంతో, షూటింగ్ సమయంలో ఆమెకు శ్రీదేవి బాగా దగ్గరయ్యారు. సాధారణంగా శ్రీదేవి సెట్లో సహ నటీనటులతో అంత తొందరగా కలవకపోయినా సజల్‌ను మాత్రం తల్లిలా దగ్గరకు చేరదీశారు. ఆ సినిమా ప్రచారంలో ఒక సందర్భంలో సజల్ తల్లిని కోల్పోయిన ఘటనను గుర్తుచేసుకుంటూ శ్రీదేవి భావోద్వేగంతో మాట్లాడారు కూడా. దీంతో శ్రీదేవి మరణంపై సజల్ తీవ్ర మనోవేదనకు గురవుతూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు