నేను పెద్ద అందగత్తెను కాదు.. కానీ గట్టి గుండె : ఖుష్బు

మంగళవారం, 13 అక్టోబరు 2020 (21:22 IST)
తమిళ సినీ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయదళ సభ్యత్వం స్వీకరించారు. నిన్నామొన్నటివరకు తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించిన పార్టీలో ఖుష్బూ చేరడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడాని గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరణాత్మకంగా లేఖ రాసినట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, హస్తానికి గుడ్‌బై చెప్పడానికి కారణం ఆ పార్టీ నడుస్తున్న తీరు సరిగా లేకపోవడమేనన్నారు. 'కాంగ్రెస్ పార్టీ మారిపోయింది, ఆ పార్టీలో నేతలు మారిపోయారు' అని వ్యాఖ్యానించారు. అంతకుమించి తన నిష్క్రమణకు గల కారణాలను వివరించలేనని తెలిపారు.
 
నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, కానీ గత నాలుగేళ్లుగా స్థానిక నేతలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నదీ చెబుతూనే ఉన్నానని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
 
జ్యోతిరాదిత్య సింథియా వెళ్లిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే చెప్పిందని అన్నారు. ఇక తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి తనను తామరాకుపై నీటిబొట్టు అని అభివర్ణించడం పట్ల ఖుష్బూ స్పందించారు. ఇలాంటి స్త్రీద్వేష వ్యాఖ్యల గురించే తాను మొదట్నించి చెబుతున్నానని స్పష్టం చేశారు.
 
'ముఖ్యంగా, నేను ఓ నటినే కావచ్చు. కానీ అళగిరి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి. నేను ప్రజలను ఆకర్షించగలను. అళగిరి నాలా జనాకర్షక శక్తి ఉన్న నేత కాదు. అందుకే, తమకంటే తెలివైన, వాక్పటిమ ఉన్న మహిళను ఈ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నించారు. విధేయత గురించి మాట్లాడడం ఇక వృథా. నాది గట్టి గుండె. నేను అందగత్తెనే కాదు, తెగువ ఉన్నదాన్ని కూడా" అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు