ప్రతి గొట్టంగాడి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (08:51 IST)
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ప్రతి గొట్టంగాడు చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన పని లేదన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా బాగుందో లేదో నిర్ణయించేది ప్రేక్షకులని, దారినబోయే దానయ్యలు విశ్లేషణలు చేయడం కరెక్టు కాదంటూ తాజాగా జరిగిన ‘జై లవ కుశ’ సక్సెస్‌మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఆవేదనతో అన్నారు. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ప్రతి గొట్టం గాడి మాటలు పట్టించుకోవద్దు, వాళ్ల గురించి మాట్లాడి మన టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అని హితవు పలికారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఫ్రీ డమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుకోవచ్చు. అసలు నేనంటాను .. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? లేదా? అని మాట్లాడుకోవడం అనవసరం మనకు. సినిమా తీసిన తర్వాత అసలు అలాంటి వాళ్ల గురించి మనం ఎందుకు ఆలోచించాలి?
 
సినిమాను ప్రేక్షకులు బతికిస్తారు. ఎవడో గొట్టంగాడు చెప్పాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గొట్టంగాడి మాట పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడటం టైమ్ వేస్ట్ అని అభిప్రాయపడ్డారు. విమర్శకుడనే వాడు సద్విమర్శ చేయాలి. సినిమా బాగుంది.. బాగోలేదు. సినిమా బాగుంటే ఎందుకు బాగుంది, బాగుండకపోతే ఎందుకు బాగోలేదో తన వరకు తాను ఎవరైనా చెప్పొచ్చు. 
 
అంతేకానీ, ‘సినిమా ఫెయిల్ అయిపోయింది’, ‘కోటి రూపాయలు వస్తాయి’, ‘పది కోట్లు వస్తాయి’, ‘డిపాజిట్లు రావు’ అంటూ విమర్శలు చేసే హక్కు ఏ విమర్శకుడికి లేదు. అసలు, వాళ్లు విమర్శకులే కారు. అటువంటి విమర్శలు చేసే వారి గురించి ఎన్టీఆర్‌లాంటి పెద్ద స్టార్ మాట్లాడటమనేది నాకు నిజంగానే బాధగా ఉంది’ అని భరద్వాజ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు