ఉదయ్ కిరణ్ బయోపిక్ వచ్చేస్తోంది.. సందీప్ కిషన్ ఆ పాత్రలో..? (Video)

సోమవారం, 25 నవంబరు 2019 (15:49 IST)
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి అందరికీ బాగా తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో తారాజువ్వలా దూసుకొచ్చి.. చిత్రం సినిమాతో కెరీర్ మొదలెట్టాడు. ఉదయ్ నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు హ్యాట్రిక్ సృష్టించాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. 
 
ఆ తర్వాత కూడా నీ స్నేహం, శ్రీరామ్ లాంటి సినిమాలు ఉదయ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్న నటుడు ఈయనే.

అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. అప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. ఛాన్సులు లేక, వచ్చిన ఛాన్సులు మిస్ కావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ డీలా పడిపోయింది. 
 
సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు చివరికి విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 
 
ప్రస్తుతం ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కనుంది. షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉన్న ఓ దర్శకుడు ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా చేయబోతున్నాడు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడు. ఉదయ్ పాత్రలో ఈయన కనిపించబోతున్నాడు. జనవరి నుంచి ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కబోతుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు