"వరల్డ్ ఫేమస్ లవర్"తో తీవ్రంగా నష్టపోయాం.. మమ్మల్ని ఆదుకోండి.. విజయ్ దేవరకొండకు వినతి

బుధవారం, 6 సెప్టెంబరు 2023 (10:26 IST)
హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఓ విజ్ఞప్తి చేసింది. "వరల్డ్ ఫేమస్ లవర్" చిత్రం ద్వారా రూ.8 కోట్ల మేరకు నష్టపోయామని, అందుకు సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన చిత్రం "ఖుషి". ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. అయితే, ఈ సినిమా సంపాదన నుంచి రూ.కోటి అభిమానుల కుటుంబాలకు ఇస్తానని విజయ్ దేవరకొండ వైజాగ్‌లో జరిగిన చిత్ర సక్సెస్ వేడుకల్లో ప్రకటించారు. విజయ్ గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్, పలువురు నెటిజన్స్ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. 
 
మరోవైపు, 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయామని, అందుకు తమకూ సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 
 
"డియర్ విజయ్ దేవరకొండ! 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ, దానిపై ఎవరూ స్పందించలేదు. మీరు దయా హృదయంతో రూ.కోటిని పలు కుటుంబాలకు అందివ్వనున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం" అని ట్వీట్లో పేర్కొంది. 
 
కాగా, విజయ్ హీరోగా 2020లో వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' అభిషేక్ పిక్చర్స్ ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. 'కేశవ', 'సాక్ష్యం', 'గూఢచారి', 'రావణాసుర' తదిరత చిత్రాలు ఈ సంస్థలో రూపొందినవే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు