వీలు చిక్కితే చిన్నారులతో సమయాన్ని వెచ్చించండి... హీరోయిన్ శ్రీలీల

ఆదివారం, 5 మార్చి 2023 (16:56 IST)
ప్రతి ఒక్కరూ వీలు చిక్కినపుడు తమ సమయాన్ని చిన్నారులతో వెచ్చించాలని హీరోయిన్ శ్రీలీల కోరుతున్నారు. ఆమె శనివారం హైదరాబాద్ నగరంలోని ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించి, అక్కడి చిన్నారులతో ఆమె విలువైన సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.
 
'గొప్ప కలలతో ఉన్న చిన్న సమూహం. గొప్ప మనసులతో ఉన్న చిన్నారులు. వాళ్లు ఎంత గొప్పవాళ్లో.. కలిసే వరకూ మీకూ తెలియదు. కలలు, కథలు, డ్యాన్స్, పాటలు, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం.. ఇలా ఈరోజు ఎంతో ఆనందంగా గడిపాను. వాళ్లందరికీ ప్రేమను పంచాలనే ఉద్దేశంతో అక్కడ అడుగుపెట్టాను. వాళ్ల అమాయకపు చూపులు, బోసి నవ్వుల్లో నేను తడిసి ముద్దయ్యాను. ఇలాంటి క్షణాలను అనుభూతి చెందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడిది అందరికీ సాధ్యమవుతుంది!! ఇతరులకు సాయం చేయాలని చాలా మందికి ఎన్నోసందర్భాల్లో అనిపిస్తుంది. కాకపోతే, ఎలా చేయాలి? ఎవరికి సాయం చేయాలి? అనేదానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది.
 
గూగుల్‌లో సెర్చ్‌ చేసి మీచుట్టూ ఉన్న ఇలాంటి ఎంతోమంది చిన్నారులను మీరు కలుసుకోవచ్చు. ఈ పోస్ట్‌ పెట్టి.. భారీ విరాళాలు ఇవ్వమని నేను కోరుకోవడం లేదు. కానీ, మీ జీవితంలో ఎంతో విలువైన సమయం, ప్రేమ, ఆప్యాయతను ఇవ్వాలని కోరుతున్నా. వీటినే వాళ్లు కోరుకునేది. వారం లేదా నెలకు ఒక్కసారైన వాళ్లతో కలిసి భోజనం చేయండి. ఇది కేవలం కడుపు మాత్రమే నింపదు. ఆనందంతో హృదయం నిండిపోతుంది. అలాంటి మనసుతోనే #Hereforyouని మొదలుపెడుతున్నా. ఏదైనా అనాథాశ్రమాన్ని మీరు సందర్శిస్తే.. ఫొటోలు తీసుకుని #Hereforyou అనే ట్యాగ్‌ని జత చేస్తూ వాటిని షేర్‌ చేయండి' అంటూ శ్రీలీల పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు