గుంటూరులోని హాయ్లాండ్లో నిర్వహించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ను కుసంస్కారి అని, వ్యక్తిత్వ వికాసం బోదించడం కాదు, ముందు నేర్చుకోవాలంటూ తీవ్ర పదజాలంతో మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు మాట్లాడిన మాటలపై ఆయన యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు.
నాగబాబు ఇలా ఎందుకు మాట్లాడాడో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. నాగబాబు ఆవేశంలో అలా మాట్లాడి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మధ్య ఒక ఫంక్షన్లో తామిద్దరం కలుసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. 'గురువుగారూ' అంటూ ఆప్యాయంగా పలకరించి, ఒక కథ చెప్పమని కోరాడని ఆయన చెప్పారు. భవిష్యత్తులో తామిద్దరం కలిసి ఓ సినిమా చేయచ్చని యండమూరి తెలిపారు.
మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్లో టాలెంట్ లేకపోతే... ఎన్ని సర్జరీలు చేసినా ఫలితం లేదంటూ గతంలో యండమూరి వీరేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. దీనిపై పెను దుమారమే లేచింది. ఈ మాటలను మనసులో పెట్టుకున్న నాగబాబు... ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ వేదికపై నుంచి యండమూరిపై విరుచుకుపడ్డారు. 'వాడో కుసంస్కారి' అన్నారు. 'వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతాడు, వాడికి వ్యక్తిత్వం లేదు. అలాంటి వాడు మైలేజ్ కోసం చేసే వ్యాఖ్యలు మాకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చవు' అంటూ మండిపడిన విషయం తెల్సిందే.