యూత్‌ను ఆలోచింపజేసే అల్లు శిరీష్ "ఏబీసీడీ"

శుక్రవారం, 17 మే 2019 (16:22 IST)
నటీనటులు: 
అల్లు శిరీష్‌, రుక్షర్‌ ధిల్లాన్‌, భరత్‌, నాగబాబు, కోట శ్రీనివాసరావు, రాజా, శుభలేఖ సుధాకర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు. 
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: రామ్‌, సంగీతం: జుదా సంధి, సంభాషణలు: కళ్యాణ్‌ రాఘవ్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, నిర్మాతలు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని, సమర్పణ: సురేష్‌ ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి 
 
అల్లు అరవింద్‌ వారసుడిగా బిజినెస్‌ వ్యవహారాలు బాగా తెలిసిన శిరీష్‌ హీరోగా రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 'కొత్తజంట'లో అందరికీ దగ్గరైన ఆయన తర్వాత కొంత గ్యాప్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తన బలం, బలహీనతలు ఏమిటో తెలుసుకున్న శిరీష్‌ ఈసారి ఎలాగైన యూత్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూ, చక్కటి సందేశం ఇవ్వాలనే తలంపుతో మలయాళంలో హిట్‌ అయిన 'ఎబిసిడి' రీమేక్‌లో నటించారు. పోస్టర్‌ మొదలుకుని ట్రైలర్‌ దాకా ఇంప్రెషన్‌ కలిగించిన ఈ 'అమెరికన్‌ బార్న్‌ కన్ఫ్యూస్డ్‌ దేశీ' చిత్రం ప్రమోషన్‌ చూస్తుంటే తాను నటించిన 'పిల్ల జమిందార్‌' గుర్తుకు వస్తుందని ప్రీరిలీజ్‌లో నాని వెల్లడించారు. ప్లాట్‌ను మాత్రమే తీసుకుని తెలుగుకు అనుగుణంగా మార్చామని చెబుతున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
 
కథ : 
అమెరికాలో పుట్టిపెరిగిన అరవింద్‌ అలియాస్‌ అవి (అల్లు శిరీష్‌) మల్టీ మిలియనీర్‌ ఎన్‌ఆర్‌ఐ విద్యాప్రసాద్‌ (నాగబాబు) వారసుడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లి  ఇచ్చిన ప్రోత్సాహంతో విచ్చలవిడి జీవితానికి అలవాటుపడతాడు. ఇది తన కొడుకు కెరీర్‌ను నాశనం చేస్తుందని నెలరోజులపాటు ఇండియా  వెళ్ళి రమ్మంటాడు. ఇష్టంలేకపోయినా స్నేహితుడు, బంధువు అయిన బాలషణ్ముగం ఉరఫ్‌ బాషా (భరత్‌) మాటలకు ఇన్‌స్పైర్‌ అయి హైదరాబాద్‌ వస్తాడు. 
 
కానీ ఇక్కడకు వచ్చాక తండ్రి పెట్టిన రూల్స్‌కు ఎదిరించలేక నెలకు ఐదువేల పాకెట్‌మనీతోనే కాలం గడపాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడే ఎం.బి.ఎ. కూడా చదవాల్సి వస్తుంది. అంతకుముందే పరియమైన నేహా (రక్సర్‌ థిలాన్‌)తో అదే కాలేజీలో చదవడంతో ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత అతనుండే బస్తీలో ప్రజల కష్టనష్టాలు చూసి యూత్‌ రాజకీయ నాయకుడు భార్గవ్‌ (రాజా సిరివెన్నెల)తో తలపడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏమయింది? తన ఎం.బిఎ. పూర్తిచేశాడా? లేదా? అనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ : 
అల్లు శిరీష్‌ ఈ పాత్రకు సరిపోయాడనే చెప్పాలి. అంతకుముందు 'ఒక్క క్షణం'తో ప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టింది. అందుకే ఈసారి సేఫ్‌ ప్రాజెక్ట్‌గా మలయాళంలో విజయవంతమైన సినిమాను ఎంచుకున్నాడు. అందుకు రాంచరణ్‌ కూడా కరెక్ట్‌ సబ్జెక్ట్‌ అనడంతో దర్శకుడిగా కొత్తవాడ్ని ఎంచుకుని చేశాడు. ఈ కాన్సెప్ట్‌ చూస్తుంటే గతంలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సిద్ధార్థ పాత్ర గుర్తుకువస్తుంది. 
 
అందులో తల్లి గారాబం, తండ్రి కొడుకు కోసం పడే ఆరాటం కన్పిస్తాయి. పాత్రలు అలాంటివే అయినా నేపథ్యం వేరువేరుగా ఇందులో వుంది. ఎబిసిడిలో హైదరాబాద్‌ నేపథ్యం కావడంతో స్లమ్‌ ఏరియా అక్కడి రోజువారీ పోరాటాలు, ఫ్యాక్టరీలోని వేస్టేజ్‌ కెమికల్‌ వల్ల చుట్టూ వున్న వారికి రోగాలు వంటి అంశాన్ని తీసుకున్నాడు. ఇందులో కామెడీ వుందంటే భరత్‌ పాత్ర అయినే ఎక్కువగా ఫన్‌ క్రియేట్‌ చేసింది. న్యూస్‌రీడర్‌ వెన్నెల కిశోర్‌ పాత్ర. న్యూస్‌ రీడింగ్‌లో వుండే పోకడలు హ్యాస్యరూపంలో బాగా చూపించాడు. 
 
ఇక హీరోహీరోయిన్ల ప్రేమ కూడా సినిమాటిక్‌గా వున్నా కొంతమేర ఎంటర్‌టైన్‌ చేయిస్తుంది. ముఖ్యంగా తన తండ్రి తాగుబోతు, తిరుగుబోతు అంటూ చెప్పే కట్టు కథ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత యువ కథానాయకుడు ఎన్నికల్లో పోటీ చేసేక్రమంలో సాగే సన్నివేశాలు బాగున్నా దాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు గందరగోళ పడినట్లుకన్పిసుంది. 
 
ముఖ్యంగా హీరోతో ప్రేక్షకుడు ట్రావెల్‌ అయ్యేలా వుండాలంటే కొన్ని హృద్యమైన సన్నివేశాలు రాసుకోవాలి. దాన్ని హత్తుకునేలా ఆవిష్కరించాలి. ఇవి చిత్రంలో దర్శకుని లోపాలు. పలు ఎమోషన్స్‌ వున్నా అవి కృతంగా అనిపిస్తాయి. నటుడిగా శిరీష్‌ చేయగలిగిన పాత్రే అయినా కొన్ని వేరియేషన్స్‌ చూపిస్తే మరింత ఆకట్టుకునేది. 
 
సిటీలో మోసాలు ఎలా వుంటాయనేవి లక్షకు, మూడు లక్షలు ఇవ్వడమనేది బాగున్నా, దాన్ని ఇంకాస్త కన్వీన్స్‌గా చూపిస్తే సరిపోయేది. హీరోయిన్‌ పాత్ర పర్వాలేదు అనిపించేలా వుంది మినహా ఆమె పెర్‌ఫార్మెన్స్‌కు పెద్ద స్కోప్‌ లేదు. ప్రముఖ దినపత్రిక యూత్‌ ఐకాన్‌ కాంటెస్ట్‌ వ్యవహారం మరింత ఆకట్టుకునేలా తీస్తే బాగుండేది. అల్లు శిరీష్‌ చెప్పిన స్పీచ్‌ కొంత కాపాడింది. కామెడీ చాలా మటుకు సంభాషణలలో వీక్‌‌నెస్‌ వల్ల అక్కడక్కడా తప్ప ఎక్కడా పెద్దగా నవ్వించలేదు. 
 
కాకపోతే మరీ భరించలేనిదిగాకాకుండా ఏదో సాగుతోందో అనే తరహాలో సాగడం ఒక్కటే ఎబిసిడి విషయంలో ఊరట కలిగించేది. హీరో డాన్సులు సోసోగానే ఉన్నా డైలాగ్‌ డెలివరీలో పరిణితి వచ్చింది. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మాస్టర్‌ భరత్‌కు ఇందులో హీరోతో సమానంగా ట్రావెల్‌ చేసే పాత్ర దొరికింది. అయితే అతన్ని బాగా ఉపయోగించుకులేదనే చెప్పాలి.
 
యువ కథానాయకుడుగా చేసిన చేసిన రాజా (సిరివెన్నెల సీతారామశాస్త్రి అబ్బాయి) మంచి పాత్రే చేశాడు. నాగబాబుది అలవాటైన పాత్రే. హీరో ఊహించి చెప్పే చిన్న ఫ్లాష్‌ బ్యాక్‌లో మాత్రం కొన్ని నవ్వులు పూయిస్తాడు. శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లు ఉన్నా ఒకటి రెండు సీన్లకే పరిమితం.
 
కొత్త దర్శకుడు సంజీవ్‌ రెడ్డి తీసుకున్న రీమేక్‌ థీమ్‌ను సగటు ప్రేక్షకుడ్ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త ఎంటర్‌టైన్‌గా తీస్తే బాగుండేది. ఇలాంటి కథల్లో లాజిక్స్‌ అవసరం ఉన్నా లేకపోయినా సబ్‌ ప్లాట్స్‌ మధ్య ఉండాల్సిన బలమైన థ్రెడ్స్‌ చాలా తేలికైన ట్రీట్మెంట్‌తో రాసుకోవడంతో ఇందులో ఏ ప్రత్యేకత లేకుండా పోయింది. 
 
కన్నడ జుదా శాండీ సంగీతం 'మెల్లమెల్లగా..' పాటకే పరిమితం. రీరికార్డింగ్‌లో సౌండ్‌ ఎక్కువయినట్లుంది.  రామ్‌ సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవచ్చు. చక్కని యాంగిల్స్‌‌తో తక్కువ బడ్జెట్‌‌లోనే వీలైనంత రిచ్‌‌లుక్‌ వచ్చేలా సెట్‌ చేసుకున్న మెప్పిస్తుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఇంకొంచెం షార్ప్‌‌గా ఉంటే సెకండ్‌ హాఫ్‌‌లో కాంటెస్ట్‌ తాలుకు భారం తగ్గేది. కళ్యాణ్‌ రాఘవ్‌ సంబాషణలు చాలా మాములుగా ఉన్నాయి. 
 
ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కథలే ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఈ చిత్రాల్లో ఎక్కువ ఇండియాలో పరిస్థితి దారుణంగా వుంది. వ్యవస్థను మార్చాల్సిన పని ఎంతైనా వుందనే కథలే ఎక్కువగా వస్తున్నాయి. "మహర్షి" కూడా దాదాపు అటువంటిదే. "ఎబిసిడి కూడా అందుకు మినహాయింపుకాదు. 
 
ఇంత కథలో అంతర్లీనంగా చక్కటి సందేశం కూడా ఇమిడి వుంది. ఇండియాలో జరుగుతున్న రాజకీయ అవినీతి, సగటు మానవుడి పోరాటం, సమాజానికి కనువిప్పు కల్గించాలంటే కోటీశ్వరుడైన ఎన్‌ఆర్‌ఐ చెబితేనే కానీ ఇక్కడి వారికి వినిపించేట్లులేదు. ఆ కోణంలో చూస్తే ఈ చిత్రం ప్రతి యూత్‌ చూడాల్సిన అవసరం వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు