అమీర్ ఖాన్ ఆ మాట అంటే చాలా సంతోషమేసిందిః చిరంజీవి

ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (22:20 IST)
నాగ చైతన్య, సాయి పల్లవి  న‌టించిన‌ లవ్ స్టోరి ప్రీరిలీజ్ హైద‌రాబాద్‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నాను. కానీ బయటకొచ్చి ఆడియెన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషం వేరు. నారాయణదాస్ నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80 వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి చ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలి. సినిమాలు నిర్మించాలి. సినిమా విలువ మరింత పెంచాలి. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నారాయణదాస్ గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. చాలా స్మార్ట్. వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే. 
 
"లవ్ స్టోరి" టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రేమ కథలు చూసి చాలా కాలం అవుతోంది. నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి నటించాడు. ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది, మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ కు చాలా మంది ఎగిరిపడుతుంటారు. కానీ చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనంతో ఉంటాడు. నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పగలను. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు, సెలెక్టివ్ గా, కొత్తగా సినిమాలు చేస్తుంటాడు. "లవ్ స్టోరి" కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ. నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సో నైస్ ఆఫ్ హిమ్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ ను కలిసినప్పుడు తనకు సినిమా మీదున్న ప్యాషన్ గురించి చెప్పాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలిపాడు. సినిమా మీద అమీర్ ఖాన్ కు ఉన్న ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మేమంతా లాల్ సింగ్ చద్దా చూసేందుకు వేచి ఉన్నాం. ఆయన హైదరాబాద్ వచ్చి, యంగ్ స్టార్స్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్. 
 
సారీరా నేను నిన్ను చూడలేదన్నా
సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమా ఆచార్యలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. 
 
సాంగ్ కోసమైనా మూడు సార్లు చూస్తాను
కొన్నేళ్ల కిందట శేఖర్ కమ్ముల కలిశాడు. మీ సినిమాలు చూస్తూ పెరిగాను, మీరంటే ఇష్టం అని చెప్పాడు. అతను వస్తే ముందు నవ్వు కనిపిస్తుంది. అంత పాజిటివ్ పర్సన్. శేఖర్ కమ్ముల ఎవరి దగ్గరా పనిచేయలేదు. కానీ ఆయనకంటూ ఒక స్టైల్ ఏర్పర్చుకున్నాడు. ఇవాళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. కమర్షియల్ యాంగిల్ కోసం తాపత్రయపడడు. తను అనుకున్న కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కిస్తాడు. శేఖర్ కమ్ముల సినిమాను నేనెంతో అభిమానిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. పవన్ మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దరియా సాంగ్ కోసమైనా "లవ్ స్టోరి" సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు