134 ఏళ్ల వివాదానికి తెరదించిన సుప్రీంకోర్టు .. కీలకంగా పురావస్తు నివేదిక

శనివారం, 9 నవంబరు 2019 (17:32 IST)
134 యేళ్ళ వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి సుప్రీంకోర్టు శనివారం ముగింపు పలికిన విషయం తెల్సిందే. అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 
 
భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పులో కీలకమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ తీర్పు సారాంశాన్ని వెల్లడిస్తూ.. అయోధ్యలో ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెబుతున్నాయి. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవు. శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్న హిందువుల విశ్వాసం వివాదరహితమన్నారు. 
 
రామజన్మ భూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇక్కడ రాముడే కక్షిదారుడు. స్థలం తమ ఆధీనంలో ఉందని సున్నీ వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువుల సందర్శించారనేందుకు ఆధారాలున్నాయి. అయితే రామ మందిరాన్ని కూల్చి మసీదును కట్టారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు కూడా లేవు అని స్పష్టం చేస్తూ 134 యేళ్ల వివాదానికి చీఫ్ జస్టీస్ రంజన్‌ గోగోయ్‌ తెరదించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు