'సైరా'ను కలవడం ఆనందంగా ఉంది... జగన్ ట్వీట్ : చిరుకు ఆ హామీ ఇచ్చిన సీఎం

సోమవారం, 14 అక్టోబరు 2019 (19:35 IST)
అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలు సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న చిరు దంపతులకు సీఎం దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత వారంతా కలిసి అక్కడే భోజనం చేశారు. 
 
ఈ భేటీ తర్వాత చిరంజీవి మీడియాతో సమావేశమై.. వివరాలు వెల్లడిస్తారని వైసీపీ, మెగాస్టార్ అభిమానులు ఎదురుచూశారు. అయితే మెగాస్టార్ మాత్రం మీడియాతో ఎలాంటి విషయాలు చెప్పకుండా వెళ్లిపోయారు. అయితే సీఎం జగన్ మాత్రం చిరంజీవిని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పోల్చారు. 
 
చిరంజీవితో తాను గడిపిన క్షణాలను తన ఫేక్‌బుక్ ద్వారా షేర్ చేశారు. "'సైరా నరసింహారెడ్డి'ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. చిరంజీవి ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలను తమకు ఇస్తూనే ఉండాలని ఆకాంక్షించారు". నిజానికి వీరి భేటీపై సినీ, రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. 
 
అయితే కేవలం సైరా సినిమా గురించే ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారు. 'సైరా' చిత్రం చూడాలని సీఎంను చిరంజీవి కోరారు. కుటుంబ సమేతంగా సైరా మూవీని చూస్తామని చిరంజీవి దంపతులకు జగన్ మాటిచ్చినట్లు సమాచారం. 
 
కాగా, 'సైరా' మూవీ విడుదలైన తర్వాత చిరంజీవి ఇద్దరు ప్రముఖులను కలుసుకున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌. ఇపుడు ఏపీ సీఎం జగన్. అయితే, తెలంగాణ గవర్నర్ మాత్రం 'సైరా' చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు