అంత ఈజీ కాదు జగనూ... శాసనమండలి రద్దు కావాలంటే…!!

మంగళవారం, 28 జనవరి 2020 (15:01 IST)
శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి సిఫార్సు చేసినా.. దానిని పూర్తిగా రద్దు చేసే నోటిఫికేషన్‌ వెలువడాలంటే… నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. గతంలో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దివంగత నేత ఎన్టీ.రామారావు శాసన మండలిని రద్దు చేయాలని సిఫార్సు చేసినప్పుడు అప్పటి కేంద్ర కాంగ్రెస్‌ పాలకులు ఖాతరు చేయలేదు. ఆ తర్వాత ఇందిరా గాంధీ మరణించాక జరిగిన ఎన్నికలలో దివంగత నేత 
 
రాజీవ్‌ గాంధీ ప్రదాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా శాసనమండలి రద్దుపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఎన్టీఆర్‌ మళ్లీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీకి గుర్తు చేయగా… మళ్లీ శాసనసభ తీర్మానం చేసి పంపండి.. పార్లమెంటులో బిల్లు పెడతామని చెప్పటంతో.. వెంటనే శాసనసభను సమావేశపరిచి శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపటం జరిగింది.
 
 
శాసనమండలిని రద్దు చేయకుండా ఉండేందుకు అప్పటి కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ మంత్రులు (మాజీ గవర్నర్‌, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా ఉన్నారు) రద్దు చేయవద్దని రాజీవ్‌ గాంధీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ… ఒకసారి శాసనసభ ఆమోదించింది.. మనం పట్టించుకోలేదు… రెండో సారి కూడా శాసనమండలిని రద్దు చేయమని శాననసభ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది… న్యాయ శాఖ సలహా కూడా తీసుకున్నాను… ఒకవేళ శాసనమండలికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకపోతే.. ఎన్టీఆర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసినట్టయితే.. కేంద్రాన్ని తప్పుపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నా చేతుల్లో ఏమి లేదు… శాసనమండలి బిల్లును తప్పనిసరిగా పార్లమెంటులో పెట్టి ఆమోదించి రాష్ట్రపతికి పంపబోతున్నాం.. దయచేసి మళ్లీ మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించవద్దని కఠినంగానే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలను మందలించారని బయటకు పొక్కింది.
 
ఆ తర్వాత పార్లమెంటు శాసనసమండలి రద్దును ఆమోదించాక.. రాష్ట్రపతి రద్దు చేస్తూ నోటిపికేషన్‌ జారీ చేశారు. ఈ తతంగం అంతా పూర్తి కావటానికి రెండేళ్లు పైగా సమయం పట్టింది. తాజాగా శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం కేంద్రానికి అందినప్పుడు ముందుగా న్యాయ శాఖ పరిశీలించాలి.. ఆ తరువాత కేంద్ర అటానిక్‌ జనరల్‌ సలహాను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సలహాల అనంతరం కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి లోక్‌సభ, రాజ్యసభలో బిల్లును పెట్టడం జరుగుతోంది. 
 
ఆ రెండు సభలు ఆమోదించాక రాష్ట్రపతి బిల్లుపై సంతకం పెడతారు.. ఆ తర్వాత కేంద్ర న్యాయ శాఖ శానసమండలి రద్దు అయినట్లు నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఈ తతంగం అంతా పూర్తి అవటానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఈ విషయాన్ని శానసమండలి సభ్యులు తమను కలిసిన వారికి వివరిస్తున్నారట. కేంద్ర బిజెపి పెద్దలు హామీ ఇచ్చాకే శాసనమండలి రద్దుకు ముఖ్యమంత్రి జగన్‌ శాసనమండలి రద్దు ప్రకటన చేశారని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు