చారిత్రాత్మక బిల్లు అభివృద్ధికి నాంది-జన చైతన్య వేదిక

మంగళవారం, 21 జనవరి 2020 (14:19 IST)
పాలన, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణలు ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన చారిత్రాత్మక బిల్లు అభివృద్ధికి నాంది పలుకుతుందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాల స్థాయికి ఎదగ గల ఏకైక నగరం విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ప్రకటించడాన్ని అభినందించారు. 
 
రాజధాని పేరుతో నాలుగు వేల 70 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి, బినామీ పేర్లతో వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడిన వారిపై న్యాయ విచారణ నిర్వహించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని, అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ నిర్ణయం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోనే సంక్షేమ పథకాలను అత్యధికంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సాధ్యం కాదని తెలిపారు. పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే హరిత ఆంధ్రప్రదేశ్‌గా మారుతుందని పేర్కొన్నారు. 
 
రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు అప్పులు, 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాజధానికి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సహేతుకం కాదని పేర్కొన్నారు.2014లో 96 వేల కోట్ల అప్పు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రెండు లక్షల 57 వేల లక్షల కోట్లకు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దేనని విమర్శించారు.
 
రాజధాని గ్రామాల్లో ఉన్న 20 వేల మంది వ్యవసాయ కూలీలకు పింఛన్ రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచడాన్ని, రూ.28వేల ఐదు వందల ఎనభై ఆరు మంది రైతులకు కౌలు వ్యవధిని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచడాన్ని జన చైతన్య వేదిక స్వాగతం పలుకుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు