కరోనా అన్‌లాక్ 4.O : లోకల్ - మెట్రో రైళ్లే కాదు.. ఎన్నో.. మరెన్నో...

మంగళవారం, 25 ఆగస్టు 2020 (17:35 IST)
కరోనా వైరస్ కారణంగా అమల్లోకి వచ్చిన లాక్డౌన్‌ ఆంక్షలను కేంద్రం మెల్లమెల్లగా సడలిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా అన్‌లాక్ 3.0 పేరుతో అనేక సడలింపులు ఇచ్చింది. ఇపుడు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అన్‌లాక్డౌన్ 4.0 కింద మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్రం అనుమతించే సర్వీసుల్లో లోకల్ రైళ్లు, మెట్రో సేవలు, ఆడిటోరియంలు, సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు ఉండే అవకాశాలున్నాయి. 
 
అలాగే, అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులను కేంద్రం ఇవ్వునుందని, అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల ఆధారంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని అంటున్నారు. ఇంతవరకూ, లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు, సింగిల్ థియేటర్ సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ వంటివి అనుమతించాలంటూ కేంద్రానికి పలు సలహాలు, సూచనలు అందాయి. అయితే, వీటిని అనుమతించే విషయంలో ఇంకా కేంద్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
 
లోకల్ రైళ్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుమతించాలనే యోచనలో కేంద్రం ఉంది. సింగిల్ స్క్రీన్ హాళ్లను సామాజిక నిబంధనలతో అనుమతించేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే ఆడిటోరియం, హాల్స్ విషంయంలోనూ థర్మల్ స్క్రీనింగ్, టెంపరేచర్ చెక్, సామర్థ్యం కంటే తక్కువ మందిని అనుమతించడం వంటి సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరి చేయనుంది. 
 
కేంద్ర మంత్రులు, సంబధిత శాఖలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకునే సమాచారాన్ని బట్టి ఏ మేరకు కార్యకలాపాలను విస్తరించాలనే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కుంటుపడిన ఆర్థిక కార్యకలాపాలకు పునరుజ్జీవనం కల్పించే చర్యల్లోభాగంగా వీటికి అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు