ఆంధ్రప్రదేశ్‌పై మాకు అమితమైన ప్రేమ ఉంది : ప్రకాష్ జావదేకర్

గురువారం, 5 ఏప్రియల్ 2018 (10:17 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల తమకు అమితమైన ప్రేమ ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పుకొచ్చారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లినా.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 'వియ్‌ లవ్‌ ఆంధ్రా.. మాకు ఆంధ్రా అన్నా.. అక్కడి ప్రజలన్నా అభిమానం. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అనే విధానం అనుసరిస్తున్నాం' అని పునరుద్ఘాటించారు. 
 
ఢిల్లీలో జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టిన విషయం తెల్సిందే. దీనికి కౌంటర్‌గా ప్రకాష్ జావదేకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు, 2014 ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో తన పాత్ర ఉందని, ఇప్పుడు విడిపోవడం బాధ కలిగించే విషయమేనని చెప్పారు. అసలు 2014 ఎన్నికల్లో తమతో టీడీపీ చేతులు కలపకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవారా అంటూ ఆయన నిలదీశారు. 
 
అంతేకాకుండా, అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన విద్యాసంస్థలన్నీ నెలకొల్పామని.. కావలసిన నిధులు, అనుమతులు వేగంగా ఇవ్వడంలో తానూ భాగస్వామినేనని జావదేకర్‌ తెలిపారు. ప్రస్తుతం నిందా రాజకీయాలు చేస్తున్నారని.. అభివృద్ధిలో రాజకీయాలు చేయడం బీజేపీ పద్ధతి కాదని.. ఇచ్చిన అన్ని హామీలూ పూర్తిచేస్తామని తెలిపారు. బీజేపీ వల్లే రాష్ట్రంలో టీడీపీకి 15 సీట్లు తక్కువ వచ్చాయనడం సరికాదన్నారు. అలాగే, వైసీపీకి తమ పార్టీ దగ్గరవుతుందనేది కూడా అవాస్తవమని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు