కళ్లున్న కబోదుల్లా మారిన కాంగ్రెస్ నేతలు : గుత్తా సుఖేందర్ రెడ్డి

సోమవారం, 16 జులై 2018 (13:42 IST)
కాంగ్రెస్ పార్టీ నేతలపై నల్గొండ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ అజ్ఞాని అయితే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చదువుకోని అజ్ఞాని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, ఇది ఈ జన్మకు సాధ్యపడన్నారు. 
 
దేశం యావత్తూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం కళ్లున్న కబోదుళ్లా మాట్లాడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూమి లేని దళితులకు వెయ్యి ఎకరాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా ఆంధ్రా నాయకత్వం విష కౌగిలిలో ఉన్నారు. సత్తా లేని, వెన్నుముక లేని నాయకులు పదవుల కోసం ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తారు. జానారెడ్డి ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే హుందాతనంగా ఉంటుంది. కోమటిరెడ్డి లాంటి కోతమూకతో కలిసి జానా తిరగడం సబుబుగా లేదన్నారు.
 
ఉత్తమ్ కుమార్ కుటుంబం నుంచి ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని... మరి వీరిది ఫ్యామిలీ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కలల్లో విహరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమని... కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు