22 సీట్ల కోసం మాపై యుద్ధమా? యడ్యూరప్ప వ్యాఖ్యలపై ఇమ్రాన్ పార్టీ

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:10 IST)
భారత నిర్వహించిన వైమానిక దాడుల వల్ల కర్నాటక రాష్ట్రంలో 22 సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్.యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ మంచి అస్త్రంగా మలుచుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 22 సీట్లపై కన్నేసి ఇంత మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. పైగా, యుద్ధం... ఎలక్షన్ ఆప్షనా అంటూ ట్వీట్‌లో ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఏకంగా బీజేపీ నేతలే విమర్శలు గుప్పించారు. దీంతో యడ్యూరప్ప వివరణ ఇచ్చుకోక తప్పలేదు. 
 
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ ట్వీట్ చేశారు. పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తాను కొద్ది నెలలుగా చెబుతూనే ఉన్నానని, ప్రస్తుత పరిణామాలకు తన వ్యాఖ్యలను ముడిపెట్టడం సరికాదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కర్ణాటకలో 22 లోక్‌సభ సీట్లు సాధిస్తుందని తాను చెప్పడం తొలిసారి కాదని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దేశ సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది.
 
అంతకుముందు భారత వైమానిక దాడులతో యువత సంబరాలు చేసుకుంటున్నారని.. ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 సీట్లకు పైగా లోక్‌సభ సీట్లు సాధించేందుకు ఉపకరిస్తాయని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. దేశం మొత్తం పాక్ అదుపులో ఉన్న భారత పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్న ఈ తరుణంలో యడ్యూరప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే విమర్శలు చెలరేగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు