జమ్మూకాశ్మీర్ గవర్నర్‌కు ఉద్వాసన.. గోవాకు బదిలీ

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (21:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన్ను గోవా గవర్నరుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరుగా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్మును నియమించింది. అలాగే, లఢక్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్‌ని నియమించింది. 
 
దీంతోపాటు మిజోరాం గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైను నియమించింది. ఇక జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌, లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయింది. జమ్ముకాశ్మీర్‌కు అసెంబ్లీ ఉండగా.. లడఖ్‌లో చట్టసభ ఉండదు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్‌ 31 నుంచి మనుగడలోకి వస్తాయి.
 
ఇదిలావుంటే, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులైన ఐఏఎస్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము 1985 బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరీశ్‌ సీఎం ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా పని చేశారు. 
 
ఈయన ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖలో వ్యయ నిర్వహణ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను ఏరికోరి జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఎల్జీగా నియమించడం వెనుక బలమైన కారణాలు ఉండివుంటాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు