కర్ణాటక సంకీర్ణంలో ముసలం : కుమార స్వామికి కోపమొచ్చింది!

మంగళవారం, 26 జూన్ 2018 (14:36 IST)
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. గత నెలలో ఏర్పాటైన ఈ ప్రభుత్వ పాలన పలు ఆటంకాల మధ్య సాగిపోతోంది. అయితే, తాజాగా ఆ సంకీర్ణ సర్కారులో ముసలం ఏర్పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
 
నిజానికి గత ఫిబ్రవరిలోనే నాటి ముఖ్యమంత్రి కమ్ ఆర్థిక మంత్రి సిద్ధరామయ్య ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ అవసరం లేదని, సప్లిమెంటరీ బడ్జెట్ చాలు అని ఆయన వాదిస్తున్నారు. ప్రభుత్వ సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్న సిద్ధరామయ్య పూర్తిస్థాయి బడ్జెన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జులై 5వతేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టాలా వద్దా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు లేరు. ఆ వంద మంది కొత్తగా వచ్చిన వాళ్లు ఉన్నారు. దీంతో కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నది సీఎం కుమార స్వామి వాదనగా ఉంది. పైగా, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, ఈ విషయంలో తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదని కుమారస్వామి స్పష్టంచేశారు.
 
పైగా, కొత్తగా వచ్చిన వంద మందికి పాత బడ్జెట్‌పై అసలు అవగాహన లేదు. పాత బడ్జెట్‌నే కొనసాగిస్తే అది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నది నా అభిప్రాయం. ఎవరైనా దీనిపై ప్రివిలిజ్ మోషన్ జారీ చేస్తే నేనేం చేయాలి అని కుమారస్వామి ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీ చేస్తే నాకేమైనా కమీషన్ వస్తుందా.. అయినా ప్రభుత్వంలో ఎవరికి కమీషన్లు వెళ్తాయో నాకు తెలుసు అంటూ ఆయన అనడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు