ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న #SayNoToWar హ్యాష్ ట్యాగ్

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (12:39 IST)
భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం వుండటంతో యుద్ధానికి ఇరు దేశాలు సిద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో యుద్ధానికి వ్యతిరేకంగా అంతర్జాలంలో #SayNoToWar అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. యుద్ధం వద్దంటూ ప్రజలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వద్దంటున్నారు. 
 
ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ పాలకోట్ వద్ద రెండో సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించింది. ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు ప్రతీకారంగా మూడు పాకిస్థాన్ వైమానిక దళ విమానాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి. అందులో ఒకటి నేల కూలగా.. మిగిలిన రెండు విమానాలు.. భారత సైన్య దాడికి పారిపోయాయి. 
 
కానీ కాసేపటికే భారత కమాండర్ అభినందన్ పాకిస్థాన్ సైన్యం చేతికి దొరికిపోయాడు. అయితే అభినందన్ మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం తొలుత ఖండించింది. కానీ పాకిస్థాన్ ఆధారాలతో వీడియోలను విడుదల చేయడంతో భారత్.. అభినందన్ మిస్సైన సంగతి నిజమేనని ఒప్పుకుంది. ప్రస్తుతం అభినందన్‌ను దేశానికి తీసుకొచ్చే అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా యుద్ధం తప్పనిసరి అంటూ సమాచారం రావడంతో.. నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలపడం మొదలెట్టారు. యుద్ధంతో ఏర్పడే నష్టాన్ని, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని "సే నో టు వార్'' అనే హ్యాష్ ట్యాగ్‌తో ముందుకొచ్చారు. 
 
యుద్ధం వద్దని.. సోషల్ మీడియాలో బోలెడు మంది పోస్టులు పెడుతున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చర్చలకు సిద్ధమంటున్న తరుణంలో యుద్ధం వద్దని ప్రజలు అభిప్రాయపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేగాకుండా యుద్ధ పరిణామాలకు సంబంధించిన పాత వీడియోలను పోస్టు చేయడం.. యుద్ధానికి ముందు, యుద్ధానికి తర్వాత ఏర్పడే పరిణామాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. 
 
ఇందుకు #SayNoToWar అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా పోస్టు చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్‌లో భారీ సంఖ్యలో అభిప్రాయాలు వెల్లువెత్తడంతో.. ప్రస్తుతం #SayNoToWar ట్రెండ్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు