నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు.... బీజేపీతో చర్చించిన సీఎం జగన్

ఆదివారం, 25 ఆగస్టు 2019 (13:10 IST)
నవ్యాంధ్ర రాజధాని విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరవాతి ఉంటుందా లేదా అన్న అంశంపై సస్సెన్స్ కొనసాగుతోంది. 
 
రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పాటైన నవ్యాంధ్రకు కొత్త రాజధానిగా అమరావతిని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి, వేలాది కోట్ల రూపాయల మేరకు పనులు కూడా చేపట్టారు. అంతేకాకుండా, తాత్కాలిక హైకోర్టు, సచివాలయాన్ని కూడా వెలగపూడి, తాడేపల్లిలలో నిర్మించారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిపై వెనకడుగు వేశారు. 
 
ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధానిపై రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన టి.జి.వెంకటేష్‌ బాంబ్‌ పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బీజేపీ అధిష్టానంతో చర్చించారని చెప్పారు. 
 
ఆయన ఆదివారం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయం బీజేపీ అధిష్టానమే తనకు తెలియజేసిందన్నారు. అధికార పార్టీ యోచన బట్టి నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. 
 
పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను జగన్ ఎంత తక్కువగా నమ్మితే ఆయన రాజకీయ జీవితానికి అంత మంచిదని టీజీ వెంకటేష్ హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు