''పదెనెట్టాంపడి''ని ఏ మహిళైనా దాటితే.. శబరిమలకు అవి రావు...?

బుధవారం, 3 అక్టోబరు 2018 (11:20 IST)
కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలను ప్రవేశించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. మహిళలకు అంత సౌకర్యంగా వుండదని.. చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో.. శబరిమలలోని 18 మెట్లను ఒక్క మహిళ దాటినా పందళ అంతఃపురం నుంచి అయ్యప్ప ఆభరణాలతో కూడిన పెట్టె శబరి మలకు రాదని, అయ్యప్ప ఆలయం ప్రభుత్వానికి సంబంధించినదైనప్పటికీ.. అయ్యప్పకు సొంతమైన ఆభరణాలు పందళ కుటుంబానికి చెందిందని రాజ కుటుంబం ప్రకటించింది. అయ్యప్ప ఆభరణాలు తమ కుటుంబానికి చెందినవి. అలాంటి ఆభరణాలు.. మహిళలు ప్రవేశించిన శబరి మల ఆలయానికి రావని, పందళ రాజ కుటుంబానికి చెందిన ఎవ్వరూ.. ఆలయానికి రాబోరని రాజ కుటుంబం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో శబరి మలకు మహిళలను అనుమతిస్తే.. శబరిమల అర్చకులు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. 
 
ఇదిలా ఉంటే.. కేరళలో కొలువుదీరిన అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, లక్షలాది మంది రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. తాము శబరిమలకు వెళ్లేది లేదని పలువురు మహిళలు ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. 
 
తాము చిన్నతనంలో స్వామిని దర్శించుకున్నామని, తిరిగి ఎప్పుడు దర్శించుకోవాలో తమకు తెలుసునని కేరళ మహిళలు తేల్చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కదలివచ్చిన మహిళా సముద్రంలా కనిపిస్తున్న ర్యాలీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు