మరికొన్ని క్షణాల్లో ఆకాశంలో అద్భుతం... ఖగోళ అద్భుత దృశ్యం రింగ్ ఆఫ్ ఫైర్

ఆదివారం, 21 జూన్ 2020 (10:03 IST)
మరికొన్ని క్షణాల్లో ఆకాశంలో అద్భుతం కనిపించనుంది. సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70 శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపిస్తుంది. 
 
దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 
 
గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3 గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.
 
2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
 
ఆదివారం వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనువిందు చేయనుంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చు.
 
రాజస్థాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది.
 
సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడాలని వారు హితవు పలుకుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు