ప్రపంచమంతా సింగపూర్ వైపే చూస్తోంది.. ఎందుకు?

సోమవారం, 11 జూన్ 2018 (11:26 IST)
యావత్ ప్రపంచం సింగపూర్ వైపే చూస్తోంది. మంగళవారం జరుగనున్న చారిత్రాత్మక భేటీపై సర్వత్రా ఆసక్తి.. ఉత్కంఠత నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. నిన్నామొన్నటివరకు కయ్యానికి కాలుదువ్విన ఇరు దేశాల అధినేతలు ఒక్క చోట భేటీకానున్నారు.


ఇందుకు వేదిక సింగపూర్. సింగపూర్‌లోని ఓ హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగా ఉన్‌లు సమావేశంకానున్నారు. ఈ అంశమే ఇపుటు హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరి భేటీ తర్వాత వెలువడే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. 
 
కాగా, ఈ రెండు దేశాధినేతల సమావేశానికి సింగపూర్‌ ముస్తాబైంది. తొలిసారి జరగనున్న ఈ చారిత్రక చర్చల కోసం సర్వం సిద్ధమైంది. అంతేకాదు, దీనిని కవర్ చేయడానికి వివిధ దేశాలకు చెందిన 3 వేల మంది జర్నలిస్టులు కూడా సింగపూర్ చేరుకున్నారు. ఇప్పటికే ఇద్దరు అగ్ర నేతలూ సింగపూర్ చేరుకున్నారు. వారు బస చేస్తున్న హోటళ్ల వద్ద కనీవినీ ఎరుగని భద్రతను కల్పించడం జరిగింది. 
 
ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉంది. అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడితో ఉత్తరకొరియా చీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇక అంతర్జాతీయ వేదికలపై కిమ్ కనిపించడం చాలా అరుదు. ఇప్పటివరకు ఆయన చైనా, దక్షిణ కొరియాలో మాత్రమే పర్యటించారు. అది కూడా ఇటీవలే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు