ఉద్యోగులపై జగన్ సర్కార్ ఎస్మా చట్టం ప్రయోగిస్తుందా? అప్పటి తమిళనాడు సీఎం జయలలిత అలా చేస్తే...

శనివారం, 29 జనవరి 2022 (19:57 IST)
ఏపీ ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యూలర్ అమలుకి ప్రభుత్వ ఉద్యోగులు ససేమిరా అంటుండటంతో వీరిపై జగన్ సర్కార్ ఎస్మా చట్టం ప్రయోగిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 
గతంలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు మొరాయించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఈ చట్టాన్ని ప్రయోగించి కొరడా ఝుళిపించారు. ఆ దెబ్బతో చివరికి ఉద్యోగులు కాళ్లబేరానికి వచ్చారు. ఐతే ఏపీ ఉద్యోగ సంఘాలు మాత్రం ఎస్మా చట్టం అంటే భయంలేదనీ, తమ పోరాటం సాగుతుందని చెపుతున్నారు.

 
ఏపీలో PRC రగడ సాగుతూ వుంది. ఈ వ్యవహారం కాస్తా ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్ల బిల్లులకు సంబంధించి ఏపీ ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేసిన కొత్త పే స్కేల్ ప్రకారం అమలు చేయాలని తెలిపింది. ఐతే ట్రెజరీ అధికారులు చీమకుట్టినట్లయినా స్పందించలేదు.

 
పీఆర్సీ సమస్య పరిష్కారం వచ్చేవరకూ కొత్త పే స్కేల్ తీసుకునేది లేదని ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ఐతే ఒకసారి పీఆర్సీపై జీవో జారీ చేసిన ప్రభుత్వం దాని ప్రకారం జీతాలు తీసుకోవాలని సూచిస్తోంది. దీనిపై ఉద్యోగులు చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు పంపిన సర్క్యూలర్ ప్రకారం ట్రెజరీ అధికారులు స్పందించకుంటే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు