కోడిపై హత్యాయత్నం జరిగింది.. ఎఫ్ఐఆర్ నమోదు చేయండి.. ఎక్కడ?

బుధవారం, 1 మార్చి 2023 (15:37 IST)
తాము అల్లారు ముద్దుగా పెంచుకునే కోడిపై పక్కింటి హత్యాయత్నానికి పాల్పడ్డారని, అందువల్ల ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పోలీసులు.. కోడిపై దాడి చేసిన మహిళను కూడా స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఆ తర్వాత ఇద్దరు మహిళల మధ్య సయోధ్య కుదిర్చి పంపించి వేశారు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
బిలాస్‌పూర్‌లోని ప్రాంతంలోని రతన్‌పూర్ పీఎస్‌‍ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ అనే మహిళ తన ఇంట్లోనే దేశవాళీ కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లు చుట్టుపక్కల ఇళ్లలోకి కూడా వెళ్లి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కోడిని పక్కింటి మహిళ చంపేందుకు ప్రయత్నించిందని, తాను చూడటంతో వదిలిపెట్టిందని తెలిపింది. దీంతో నా కోటికి స్వల్పంగా గాయమైనట్టు పేర్కొంది. అందువల్ల ఆ మహిళపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో దిక్కుతోచని పోలీసులు ఆమె భర్తను స్టేషన్‌కు రప్పించారు. ఆయన కూడా పక్కింటి మహిళపై కేసు నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో కోడిపై దాడికి యత్నించిన మహిళను స్టేషన్‌కు పిలిపించారు. ఆమె వద్ద విచారించగా, తాను కోడిపై దాడి చేయలేదని, ఆమె చెబుతున్నదంతా అబద్దమేనంటూ పేర్కొన్నారు. చివరకు ఆ ఇద్దరు మహిళల వద్ద పోలీసులు సయోధ్య కుదిర్చి ఇంటికి పంచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు