దక్షిణ భారత బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద "గేమ్ షో"

మంగళవారం, 27 అక్టోబరు 2009 (17:27 IST)
Srini
WD
దక్షిణ భారత బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద గేమ్ షోను సన్ టీవీలో ప్రసారం కానుంది. ఈ షోను సన్ నెట్‌వర్క్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. "డీలా నో డీలా" అనే పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ భారత బుల్లితెర చరిత్రలోనే అతిపెద్ద టీవీ గేమ్ షోగా ఖ్యాతిగడించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రసారం చేయనున్నారు. ఈ పోటీలో పాల్గొనే ప్రతి పోటీదారునికి యాభై లక్షల రూపాయల వరకు నగదు బహుమతిని అందజేయనున్నారు.

ఇందుకోసం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్ శివార్లలోని పెరుంగుడిలో ఉన్న సన్ టీవీ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. గేమ్‌లో పాల్గొనే పోటీదార్లతో పాటు.. షోను తిలకించేందుకు వచ్చే ఆహ్వానితులు సౌకర్యవంతంగా కూర్చొనే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సెట్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పండించేలా ఈ షోను చిత్రీకరిస్తున్నారు.

అంతేకాకుండా షోను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు కూడా రూ.లక్ష ప్రతి రోజూ నగదు బహుమతి అందజేస్తారు. ఈ షోకు నటి రిషీ యాంకర్‌గా వ్యవహరించనుంది. బుల్లితెరకు ఆమె తొలిసారి ఈ షో ద్వారా పరిచయం అవుతున్నారు. "ఆనందతాండవం" అనే చిత్రం ద్వారా ఆమె వెండితెరకు ఇప్పటికే పరిచయమైన విషయం తెల్సిందే.

కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలను ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందిస్తూ
Srini
WD
వస్తున్న సన్ టీవీ... "డీలా నో డీలా" కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో చిత్రీకరించినట్టు సన్ టీవీ సీఓఓ అదిత్ విద్యాసాగర్ చెప్పారు. 73 దేశాల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో నగదు బహుమతి రూ.500 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.


ఈ పోటీలో 26 సూట్‌కేసులు ఉంటాయన్నారు. ఒక్కో సూట్‌కేసులో రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందన్నారు. వీటిలో ఏదో ఒక సూట్‌కేసును తీసుకుని అందులో ఎంత మొత్తంలో నగదు ఉందో తెలుసుకోకుండానే మిగిలిన 25 బాక్సుల్లో ఎంత మొత్తంలో డబ్బు ఉందో కనుక్కోవడమే ఈ గేమ్ అని వివరించారు. వివరించేందుకు, వినేందుకు ఆసక్తిగా ఉన్న ఈ గేమ్ షోకు బుల్లితెర ప్రేక్షకులు ఏ మేరకు రేటింగ్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి