'బిగ్ బాస్' రాత్రి 9 గంటలకే ప్రసారం చేసుకోవచ్చు: హైకోర్టు

FILE
కలర్స్ "బిగ్ బాస్" షోకు ముంబై హైకోర్టు స్టే విధించింది. కలర్స్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించి 24 గంటలు పూర్తి కాకముందే ఆ కార్యక్రమ నిర్వహకులు ముంబై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

కాగా.. రియాల్టీ షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "బిగ్ బాస్", రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "రాఖీ కా ఇన్సాఫ్" షోలను ఈ సమయంలో ప్రసారం చేయాలని ఆ శాఖ కోరింది.

బిగ్ బాస్ షో అభ్యంతరకరంగా ఉన్నందున రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో, ముంబై కోర్టు యధావిధిగా బిగ్ బాస్ షోను నిర్వాహకులు రాత్రి 9 గంటల సమయంలోనే ప్రసారం చేసుకోవచ్చునని హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ రియాలిటీ షో లో భాగంగా మూడు రోజుల పాటు మిగిలిన సభ్యులతో గడిపేందుకు పమేలా ఆండర్సన్ ఎంటరయ్యింది. బిగ్ బాస్ హౌస్‌లో పమేలా పదనిసలు చూసేందుకు బాలీవుడ్ స్టార్లు సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా పమేలా ఆండర్సన్ మాట్లాడుతూ.. ఇది వరకు బాలీవుడ్ సినిమాలు చూశానని, అయితే సినీ నటుల పేర్లు మాత్రం తనకు గుర్తు లేవంటోంది. ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎవరే తనకు తెలియదని చెప్పేసింది. అయితే ముఖం చూస్తే గుర్తు పడతానని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి