బుల్లితెరపై వెండి వెలుగులు ప్రసరింపజేస్తున్న "బిగ్ బి"

File
FILE
అమితాబ్‌ బచ్చన్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాధించుకున్న ఘనత అమితాబ్‌కే దక్కుతుంది. బాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ లెజెండ్, ఇలా ఆయనకు ఎన్ని బిరుదులిచ్చినా తక్కువే అనిపిస్తాయి. వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన బిగ్ బి ఇప్పుడు నేరుగా మన ఇళ్లకే వచ్చేశారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి అనే రియాల్టీ క్విజ్ షో ద్వారా బిగ్ బి సామాన్య ప్రేక్షకులకు సైతం మరింత చేరువయ్యారు. అంతటి అగ్ర హీరో ఓ టెలివిజన్ షోలో నటిస్తున్నాడంటే ఇంక ఆ టెలివిజన్ టిఆర్‌పి రేటింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం అదే జరిగింది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రదర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ వల్ల ఆ సంస్థ టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టిఆర్‌పి) ఒక్కసారిగా ఐదు శాతానికి పెరిగింది.

దీంతో సోనీ టెలివిజన్ సంస్థ ఆనందం అవధులు దాటింది. సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల (జిఈసి)లో ఇంత అత్యధిక సగటు రేటింగ్ నమోదవ్వడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 9.00 నుంచి 10.30 వరకూ కొనసాగుతుంది. ఇదే సమయానికి కలర్స్ అనే మరో టెలివిజన్ ఛానెల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 4 అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. అయితే దీని సగటు టిఆర్‌పి రేటు 3.4 శాతంగా మాత్రమే నమోదైంది.

బిగ్ బి జన్నదినాన్ని పురస్కరించుకొని ఈ నెల సోమవారం రోజున కెబిసి 4 తొలి ఎపిసోడ్‌ను ప్రారంభించారు. ఈ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ తోలి ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌తో పాటు క్రికెట్ కామెంటేటర్ చారూ శర్మ, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌లు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి కంటెస్టెంట్ రూ. 3,20,000ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. ఈ ప్రోగ్రమ్‌కు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది.

వెబ్దునియా పై చదవండి