మీడియాల మధ్య చిచ్చు పెట్టేందుకు 'లోకల్ టీవీ' యత్నం..!?

WD
స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో ఆర్భాటంగా సి. అశ్వనీదత్ ప్రారంభించిన "లోకల్‌టీవీ" ఛానల్ తాజాగా మీడియా అవార్డులను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే రెగ్యులర్ అవార్డులనేవి సినిమాలకు సంబంధించి ఉంటాయని తేల్చి చెప్పింది. అయితే మీడియా అవార్డులు ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్న మీడియా నుంచే వచ్చింది.

అవార్డుల్లో జనరంజక న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్, జనరంజ టీవీ న్యూస్ రీడర్, న్యూస్ ప్రెజెంటేటర్స్, టీవీ దర్శకుడు, రియాల్టీ షో, యాంకర్ ఇలా అన్ని కలిపి 29 అవార్డులను లోకల్ టీవ్ ఛానల్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించింది.

ఈ సమావేశంలో ఛానల్ మేనేజింగ్ డైరక్టర్ స్వప్నాదత్ మాట్లాడుతూ.. మీడియా అవార్డులను ఇవ్వడం చాలా గౌర్వంగా ఉందన్నారు. అయితే ఈ అవార్డులను ఇవ్వడం ద్వారా మీడియా వర్సెస్ మీడియాగా మారే ప్రమాదముందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్వప్నాదత్ సరైన సమాధానమివ్వలేకపోయారు.

ఒక పేపర్‌కు లేదా విలేకరికో అవార్డును ఇస్తే.. మిగతావారు దాన్ని కవర్ చేయరు. దీన్ని ఎలా డీల్ చేస్తారని అడిగిన ప్రశ్నకు లోకల్‌ఛానల్ మీడియా హెడ్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా అంతలోతుగా ఆలోచించలేదని చెప్పారు. ఏమీ ఆలోచించకుండా ఇటువంటి అవార్డులు ఇవ్వడం, ఎవరో స్పాన్సర్స్‌ను పట్టుకుని ఏదో చేద్దామనా? అని ఓ విలేకరి ఘాటుగా ప్రశ్నించడంతో రాజేంద్రప్రసాద్ అవాక్కయ్యారు.

కొసమెరుపు ఏమిటంటే..? ఇటీవలే లోకల్‌ టీవీ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయాన్ని వేరొక చోట మార్చారు. అందులోని సగం సిబ్బందిని కూడా ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం ఉన్నసిబ్బందికి సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇటువంటి అవార్డులు, దానికి ఖర్చులు ఏమిటని ప్రెస్‌మీట్ తర్వాత అనుకోవడం విశేషం.

వెబ్దునియా పై చదవండి