మా బడ్జెట్‌నే అరుణ్ జైట్లీ కాపీ కొట్టారు : సోనియా గాంధీ

గురువారం, 10 జులై 2014 (15:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ మొత్తం యూపీఏ బడ్జెట్‌కు అనుకరణగా సాగిందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
జైట్లీ బడ్జెట్‌లో యూపీఏకు చెందిన మెజార్టీ పథకాల కొనసాగింపే ప్రధాన భూమిక పోషించిందని కూడా ఆమె పేర్కొన్నారు. సామాజిక రంగానికి అసలు కేటాయింపులే లేవని పెదవి విరిచారు. ఇక, సంక్షేమ పథకాలకు పెద్దగా కేటాయింపులేమీ లేవని లోక్‌సభలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. 
 
అలాగే ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. నిన్నటి యూపీఏ బడ్జెట్‌కు, నేటి మోడీ సర్కారు బడ్జెట్‌కు లేశమాత్రం కూడా తేడా లేదన్నారు. అప్పటి బడ్జెట్ ప్రతుల్లో చిదంబరం పేరు బదులు అరుణ్ జైట్లీ పేరు పెట్టేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అంతేగాక రెండు ప్రభుత్వాల బడ్జెట్లూ ఏకరీతిగా సాగాయని ఆయన విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి