అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ 2014 -15 : హైలెట్స్... ఐటీ పరిమితి పెంపు..
గురువారం, 10 జులై 2014 (12:20 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ను లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ సర్కారుకు ఇదే తొలి బడ్జెట్. జైట్లీ బడ్జెట్లోని ప్రధానాంశాలు ఇవే...
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వల్ప ఊరట కలిగించారు. ప్రస్తుతమున్న ఆదాయ పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు. అలాగే, సీనియర్ సిటిజన్లకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఇతర వర్గాలక వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. 80 సీసీ పన్ను పరిమితిని రూ.1.50 లక్షలకు పెంచారు. పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచారు.
* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. నెలకు రూ.1000 పెన్షన్. ఈ పథకం కోసం రూ.250 కోట్ల కేటాయింపు.
* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ.1000 కోట్లు.
* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ. 500 కోట్లు.
* నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
* వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం.
* మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు.
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు.