కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి తీపి కబురు వుంది. అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గురువారం లోక్సభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రత్యేక నిధులతో ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. వీటిలో వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అఖిల భారత వైద్య విజ్ఞాన ఆసుపత్రి (ఎయిమ్స్), ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి వాటిని నెలకొల్పనున్నట్టు ఆయన ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు.