తేనె, కలబంద గుజ్జు తలకు పట్టిస్తే..?

శుక్రవారం, 9 నవంబరు 2018 (10:59 IST)
వాతావరణంలోని మార్పులు, తరచుగా ప్రయాణాలు చేయడం వలన జుట్టు ఎండుగట్టిలా మారిపోతుంటుంది. అందువలన చాలామంది జుట్టుకు డైలు వాడడం, కెమికల్స్ షాంపూలు వాడే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పదార్థాలు వాడడం వలన జుట్టు రాలిపోతుంది. దాంతో పాటు జుట్టు చివర్లో చిట్లే అవకాశాలున్నాయి. జుట్టు చిట్లడం ప్రారంభమైతే చాలు.. ఇక జుట్టు పెరిగే అవకాశాలే లేవు. సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అదే విధంగా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయాలి.
 
1. మెంతి ఆకులు, మందార ఆకులను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఆలివ్ నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒక్కసారి చేసినా కూడా జుట్టు రాలే సమస్య తొలగి ఒత్తుగా పెరుగుతుంది.
 
2. అలానే తేనెలో పావుకప్పు కలబంద గుజ్జు, కొద్దిగా గుడ్డు సొన కలిపి జుట్టు రాసుకోవాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దాంతో వెంట్రుకలు పొడిబారకుండా ఉంటాయి. ఈ ప్యాక్స్ వేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెస్ట్స్ రావు.
 
3. బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా కాఫీ పొడి, నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే జుట్టు చిట్లకుండా ఉంటుంది. 
 
4. మందార పువ్వులను పొడిలా చేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్, తేనె, పెరుగు కలిపి తలకు పట్టించాలి. రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
5. పెరుగులో కొద్దిగా మెంతి పొడి, బీట్‌రూట్ రసం, గోరింటాకు పొడి కలిపి తలకు పూతలా వేసుకోవాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు పట్టకుచ్చులా పెరుగుతుంది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు