మంత్రిపదవికి గుడ్బై చెప్పిన కొండా సురేఖ సరికొత్త వివాదానికి తెరతీశారు. కాంగ్రెస్ పార్టీలోని కమ్మ వర్గానికి చెందిన నేతల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పార్టీ అంటే.. కేవలం ఒక సామాజిక వర్గం గుత్తాధిపత్యమే కాదని, అన్ని వర్గాల మిళితమని వారు అంటున్నారు. అంతేకాకుండా, సురేఖ వ్యాఖ్యలు జగన్ భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదని వారు అంటున్నారు.
వైఎస్ లేని మంత్రివర్గంలో కొనసాగలేనని ప్రకటించిన కొండా సురేఖ తాను నిర్వహిస్తూ వచ్చిన రాష్ట్ర స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రిపదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామా లేఖ ఆమె వ్యక్తిగతం అయినప్పటికీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి.
రాజకీయాల్లో ఉన్నత స్థితిలో ఉండే సురేఖ ఎంతో సౌమ్యురాలిగా పేరుంది. వైఎస్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలంతో ఆమె, ఆమె భర్త ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా చెలామణి అవుతున్నారు. అయితే, వైఎస్ దుర్మరణం అనంతరం సురేఖ తమ ప్రియతమ నేతపై ఉన్న ప్రేమాభిమానాలను బాహాటంగానే వెల్లడించారు. వైఎస్ తనయుడు జగన్కు సీఎం పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా ఆమె నడుచుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. గవర్నర్కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆమె మీడియా ముందు చేసిన వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంకు చెందిన కాంగ్రెస్ మహిళా నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా దుమ్మెత్తి పోశారు. అంతటితో శాంతించని సురేఖ... కమ్మ వర్గంపై కూడా విమర్శలు చేశారు.
సొంత పార్టీకి చెందిన కొందరు కమ్మ నేతలు, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ, సీపీఎం నేతలతో పాటు రెండు ప్రధాన పత్రికాధిపతులతో చేతులు కలిపి జగన్ సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, కాంగ్రెస్లోని కమ్మవర్గం నేతలు చంద్రబాబుతో చేతులు కలిపి అధిష్టానం వద్ద జగన్ను దోషిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారని ధ్వజమెత్తారు.
ఈ వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలతో పాటు.. సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సురేఖ అవివేకంతో ఇలా వ్యాఖ్యానించారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం సురేఖ వెంటనే భేషరతు క్షమాపణలు చెప్పడం లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. సౌమ్యురాలిగా పేరున్న కొండా ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. ఆమె వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, గుంటూరు ఎంపీ కావూరి సాంబశివరావు మరో అడుగు ముందుకు వేసి.. సురేఖ చేసిన వ్యాఖ్యలు జగన్ భవిష్యత్పై తీవ్రప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సురేఖ ముందూవెనుక ఆలోచన చేయకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఎన్టీఆర్ ప్రభంజన సమయంలోనూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తు చేశారు.
సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. జగన్ను సీఎం కాకుండా అడ్డుకోవాల్సిన అగత్యం తమకు లేదన్నారు. తెదేపా నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా, జగన్ వ్యవహారాల్లో తమ అధినేత చంద్రబాబు నాయుడు తలదూర్చాల్సిన పని అంతకంటే లేదన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్లో ఫైర్ బాండ్గా పేరున్న రేణుకా చౌదరి మాత్రం ఇంతవరకు పెదవి విప్పక పోవడం గమనార్హం.
మొత్తం మీద కొండా సురేఖ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. వైఎస్ దుర్మరణం అనంతరం ఇపుడిపుడే కుదురుకుంటున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆమెపై అధిష్టానం తీసుకోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.