దివ్వెల పండుగ అయిన దీపావళి రోజున తలంటు పోసుకుని పితృదేవతలను పూజించాలని పురోహితులు అంటున్నారు. అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేయడం వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
"తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!."
"యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి" అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతృప్తి ఆశీర్వదిస్తారని ప్రతీతి. దీపావళినాడు నూనెలో (ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారని, కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి.
ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని పురోహితులు అంటున్నారు. అంతేకాదు.. తలంటుపోసుకుని అభ్యంగన స్నానం చేయడం ద్వారా గంగానదీ స్నాన ఫలం లభిస్తుందని, నరక భయం ఉండదనేది పురాణాలు చెబుతున్నాయి.
ఇకపోతే.. దీపావళి మహోత్సవాన్ని శ్రీరామచంద్రుడు రావణ సంహారము గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన సందర్భంగా, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా.. దివ్యకాంతుల దీపాలను అలంకరించి బాణసంచా కాలుస్తూ.. అందరూ వారివారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు.