మోహన్ బాబూ.. పిల్లలున్నారు.. ఇప్పుడవన్నీ ఎందుకూ..?: చిరు

WD
చిత్రరంగంలో హేమాహేమీలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని, యువరత్న బాలకృష్ణను, దర్శకరత్న దాసరి నారాయణరావులను "ఝుమ్మంది నాదం" ఆడియో కార్యక్రమానికి మోహన్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ... "చిరంజీవీ... నీ గురించి చెప్పాలయ్యా.. నువ్వు పరిచయం అయినప్పుడు.." అంటూ ఏదో చెప్పబోతుండగా... లాభం లేదని చిరంజీవి మోహన్ బాబు చేతిలోంచి మైకుని లాక్కుని... "మోహన్ బాబూ.. నీకు ఏజ్ పెరిగినా ఎలా మాట్లాడాలో ఇంకా తెలియడం లేదు. పిల్లలున్నారు.... మనం మన ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడాలి" అని చురక అంటించారు.

దీంతో మోహన్ బాబు ఆవేశపడిపోతాడని అందరూ అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా మోహన్ బాబు చాలా కూల్‌గా నా సినిమాలకు గెస్ట్‌గా వచ్చి సిల్వర్ జూబ్లీ చేశాడంటూ చిరంజీవిని పొగడ్తలతో ఆకాశనికెత్తేశారు.

ఆ తర్వాత యువరత్న బాలకృష్ణ లక్ష్మీ ప్రసన్నను ఉద్దేశించి... "మంచు అనాలా..? పెళ్లయితే ఇంటిపేరు మారుతుంది కదా.." అంటూ ఒకటికి రెండుసార్లు సందేహం వ్యక్తం చేయడంతో వెంటనే మోహన్ బాబు అందుకుని... "ఇప్పుడు దాని సంగతి ఎందుకూ.." అన్నారు. దీంతో బాలకృష్ణ "మంచు లక్ష్మీప్రసన్న మా అమ్మాయి" అంటూ సంబోధించారు.

ఇక చివరగా చిరంజీవి మాట్లాడుతూ... "రాఘవేంద్రరావుకు పనేమీ లేదా.. ఎప్పుడూ బొడ్డుమీద పూలు, పండ్లు వేస్తూనే ఉంటాడా...?" అని మోహన్ బాబు తనతో అన్నాడని చెప్పడంతో కె. రాఘవేంద్రరావు తెగ సిగ్గుపడిపోయారు.

వెబ్దునియా పై చదవండి