భోగి, సంక్రాంతి పండుగలకు తర్వాత రోజున కనుమ పండుగ వస్తుంది. పల్లెల్లో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. పంట పనుల్లో గల అనుబంధాన్ని సంక్రాంతి పండుగ ఆవిష్కరిస్తూ ఉంటుంది. భోగి, సంక్రాంతి రోజుల్లో పాలు, ధాన్యాలతో తయారు చేసిన వంటలను దైవానికి నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు.
తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు.
ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమ దిద్ది .. వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.